నాగులవంచలో రైతుల భారీ రాస్తారోకో
రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు
అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
కాకతీయ, చింతకాని: మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మండలంలోని నాగులవంచలో రైతులు సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆందోళనతో రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సీపీఎం నేతలు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, గురజాల హనుమంతరావుల ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను వెంటనే లారీల ద్వారా గోడౌన్లకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు కేవలం 26.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను ఎత్తివేసి, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలని పట్టుబట్టారు. వైరా సీఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు.
రెండు రోజుల్లో సమస్య పరిష్కారం..
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తహసీల్దార్ ఫోన్ ద్వారా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. రెండు రోజుల్లో లారీలు పంపి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో పోలీసులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు మడుపల్లి గోపాలరావు, వత్సవాయి జానకిరాములు, వంకాయలపాటి లచ్చయ్య, కోపూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

