పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అగ్నిప్రమాద బాధితులకు పరిహారం అందించాలి
ఏఐకేఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు డిమాండ్
కాకతీయ, చింతకాని: మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట కాలిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఏఐకేఎస్ చింతకాని మండల ప్రతినిధి బృందం పాతర్లపాడు గ్రామాన్ని సందర్శించి, కాలిపోయిన పంటను పరిశీలించింది. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం వల్లే మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, కాటాలు, లారీల రాకలో జాప్యం జరుగుతోందని, వేసవి కావడంతో అగ్నిప్రమాదాల భయంతో రైతులు రాత్రిళ్లు పంట వద్దే కావలి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాటాలు వేసిన బస్తాలను గోడౌన్లకు తరలించేందుకు ఒక్కో బస్తాకు రూ. 40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
తక్షణమే పరిహారం చెల్లించాలి..
పాతర్లపాడు ప్రమాదంలో పంటతో పాటు గొర్రెలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని, బాధిత రైతులకు, గొర్రెల కాపరికి తక్షణమే నష్టపరిహారం అందజేయాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాలని, లేనిపక్షంలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పావులూరి మల్లిఖార్జునరావు, ఏఐకేఎస్ మండల కార్యదర్శి పదిమల వెంకటనర్సయ్య, నాయకులు తాళ్లూరి యాదగిరి, కొత్తపల్లి రమేష్, గడ్డం సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

