డ్రంక్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు
చందుర్తి సీఐ రవీందర్
కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ రవీందర్, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలో ప్రధాన రహదారుల వద్ద వాహనాలను ఆపి డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలతో పాటు జైలుశిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసుల ఈ తనిఖీలతో గ్రామంలో కొంతసేపు సందడి నెలకొంది. ప్రజలు పోలీసుల చర్యలను అభినందిస్తూ రోడ్డు భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు.

