కల్లాల్లో కష్టం.. మిల్లర్లకు దోపిడీ ఇష్టం..!
ఆగని తరుగు దోపిడీ.. ప్రభుత్వం చెప్పిన పట్టించుకోని మిల్లర్లు
ఒక్కో బస్తాకు రూ.3 నుంచి రూ.5 అక్రమంగా వసూళ్లు
కొనుగోలు కేంద్రాల్లో నిండా దోపిడీయే
ఆగ్రహించిన మల్యాల రైతులు.. రోడ్డెక్కి నిరసన
కాకతీయ, చందుర్తి : చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీని నిరసిస్తూ బుధవారం వేములవాడ – కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కల్లాలకు తీసుకొస్తే తీవ్రంగా నష్టపరుస్తున్నారని వాపోయారు. ఐకేపీ కేంద్రాల ఇంచార్జులుగా ఉన్న వీవోఏలు సమ్మెకు దిగడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ధాన్యం రోజుల తరబడి కల్లాల్లోనే ఉండిపోతోందని, అకాల వర్షాలు కురిస్తే తాము నిలువునా మునిగిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హమాలీలు, లారీల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరిట క్వింటాకు భారీగా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. వీటికి తోడు ఒక్కో బస్తాపై రూ.3 నుండి రూ.5 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలే దోపిడీ కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. వెంటనే సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

