సినిమా ఆఫర్ పేరుతో రూ.23 లక్షలు హాంఫట్
మహిళ అకౌంట్ నుంచి నగదు దోపిడీ
ఫేస్బుక్ నుంచి గాలం వేసి.. ఘరానా మోసం
బాధితురాలి బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసి లగ్జరీ కారు కొనుగోలు
లబోదిబోమంటున్న మణుగూరు మహిళ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
కాకతీయ, మణుగూరు: సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి మణుగూరులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. ఫేస్బుక్లో పరిచయమైన ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మినందుకు ఒక మహిళ ఏకంగా రూ.23 లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడింది. సినిమా అవకాశాల పేరిట నమ్మించి ఆమె బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేయడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరుకు చెందిన ఒక మహిళకు ఫేస్బుక్ ద్వారా వైజాగ్కు చెందిన ఎల్.వి.ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తానేదో పెద్ద సినిమా రంగంలో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చిన సదరు నిందితుడు, ఆమెకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలతో వల వేశాడు. ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత, సినిమా అగ్రిమెంట్లు, ఇతర లాంఛనాల పేరిట ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించాడు.
అకౌంట్ హ్యాక్ చేసి లగ్జరీ కారు కొనుగోలు!
బాధితురాలి బ్యాంక్ వివరాలు చేతికి చిక్కడంతో నిందితుడు ఎల్.వి.ప్రసాద్ ఆమె ఖాతాను హ్యాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుండి ఏకంగా రూ.23 లక్షల మొత్తాన్ని కాజేసి, ఆ డబ్బుతో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. తన అకౌంట్ నుండి అంత పెద్ద మొత్తంలో డబ్బు మాయమవ్వడం గమనించిన బాధితురాలు షాక్కు గురైంది. తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

