ఊక లారీల అక్రమ రవాణా
నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్
ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి యథేచ్ఛగా దందా
రాత్రివేళ భీతావహంగా మారుతున్న ప్రధాన రహదారి
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, సీజ్ చేయాలని ప్రజల డిమాండ్
కాకతీయ, మణుగూరు : మణుగూరు పరిసర ప్రాంతాల నుంచి ఊక, పత్తి లోడ్లతో నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న లారీల రాకపోకలు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీలు నిర్ణీత సామర్థ్యానికి మించి లోడ్ తీసుకెళ్లకూడదు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. పట్టపగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా రాక్షస లోడ్తో లారీలు ప్రధాన రహదారిపై దూసుకెళ్తుంటే, వాహనదారులు, పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. మణుగూరు నుంచి బయలుదేరే ఊక లారీలను చూస్తే, అధికారుల పర్యవేక్షణ ఎంత నామమాత్రంగా ఉందో అర్థమవుతోంది. ఒక్కో లారీకి సాధారణ సామర్థ్యానికి రెట్టింపు లోడ్ను ఎక్కించి, టార్పాలిన్లతో కప్పి రోడ్డుపైకి వదులుతున్నారు. ఈ లోడ్ వాహనం వెడల్పు కంటే ఎక్కువగా ఉండటంతో, ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడ్ నుంచి ఎగిసిపడే ఊక కళ్లలో పడి వాహనదారులు కింద పడిపోతున్నా, అధికారుల కళ్లు మాత్రం తెరచుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

రాత్రిపూట మరింత దర్జా..
సాధారణంగా రాత్రి 9 గంటలు దాటిందంటే చాలు.. పట్టణ ప్రధాన రహదారిపై ఈ ఓవర్ లోడ్ లారీల హడావిడి మొదలవుతుంది. పట్టణం మధ్యలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడే ఈ భారీ వాహనాలు దూసుకెళ్లడంతో చిన్న వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. గతంలో ఇటువంటి అక్రమ రవాణా వల్ల అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఓవర్ లోడ్ రవాణా నేరం. అటువంటి వాహనాలకు భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఆర్టీఏ, పోలీసు శాఖలకు ఉంది. కానీ మణుగూరులో చెక్పోస్టుల వద్ద ఈ లారీలు యథేచ్ఛగా వెళ్తున్నాయంటే, అధికారులకు తెలిసే జరుగుతోందా? లేక ఆయా విభాగాల మధ్య కుమ్మక్కు ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద లోడ్ ఉన్న వాహనాలు అధికారుల కంట పడకపోవడం ఆశ్చర్యకరమే.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి..
“ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిది” అని మణుగూరు ప్రజలు వేడుకుంటున్నారు. వెంటనే ఈ లారీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని, డ్రైవర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటలూ ప్రధాన రహదారిపై నిఘా పెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఇకనైనా ఆర్టీఏ అధికారులు నిద్ర వీడి, రహదారి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

