ధాన్యం రవాణాలో రూ.కోట్ల అవినీతి
కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్ర
దొంగలు దొరికాక మా వాళ్లు కాదంటున్నారు
ప్రభుత్వ విప్ అనుచరులపై విచారణ చేపట్టాలి
లోతైన విచారణ జరిపితే రూ. కోట్ల అవినీతి రట్టు
మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి
ఆది శ్రీనివాస్ అనుచరుల పాత్రపై ఫోటోలు బయటపెట్టిన బీఆర్ఎస్
ధాన్యం, మక్కల కొనుగోళ్లపై ‘సిట్’ తో విచారణ జరిపించాలని డిమాండ్
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లాలో జరిగిన ధాన్యం అక్రమాల వెనుక అధికార కాంగ్రెస్ ముఖ్య నాయకుల పాత్ర ఉందని, పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపడితే భారీ స్థాయిలో అవినీతి బయటపడుతుందని ఆరోపించారు. ఈ ధాన్యం కుంభకోణంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు చాలా స్వల్పమని, లోతైన విచారణ జరిగితే కోట్ల రూపాయల అక్రమాలు బయటపడే అవకాశం ఉందని న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి పేర్కొన్నారు. రైతుల కష్టార్జిత పంటను కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో దారి మళ్లించి అక్రమ లాభాలు పొందారని ఆరోపించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గడ్డం స్వామి అలియాస్ నర్సారెడ్డి నకిలీ ట్రాక్ షీట్లతో రెండు లారీల ధాన్యాన్ని విక్రయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సదరు నిందితుడికి ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే రుద్రంగిలో ప్రత్యేక ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారనే బలమైన అనుమానాలు ఉన్నాయన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాలపై కూడా దర్యాప్తు చేయాలి
ధాన్యం మాత్రమే కాకుండా మక్కల కొనుగోళ్లలోనూ ఇదే తరహా అక్రమాలు జరిగి ఉండవచ్చని, రుద్రంగిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొనుగోలు కేంద్రాలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన వేములవాడలో కాకుండా రుద్రంగిలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు. ధాన్యం గోదాములకు తరలించినప్పటికీ అనేక మంది రైతులకు ఇప్పటికీ ట్రక్ షీట్లు అందలేదని, దీనివల్ల రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. విచారణను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్యకర్తల వేధింపులపై ఆగ్రహం
ధాన్యం కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన కథనాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన ఓ దివ్యాంగ కార్యకర్తను రాత్రివేళ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం అత్యంత ఖండనీయమన్నారు. సమావేశంలో కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్రావు మాట్లాడుతూ ధర్మారం-కొలనూరు ప్రాంతం నుంచి తరలించిన ధాన్య లారీలకు సంబంధించిన ట్రక్ షీట్లు ఇప్పటికీ అందలేదని ఆరోపించారు. సనుగుల సింగిల్ విండో చైర్మన్ జలగం కిషన్రావు మాట్లాడుతూ రుద్రంగిలో ఏర్పాటు చేసిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) కౌంటర్, మక్కల కొనుగోలు కేంద్రాల కేటాయింపు వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్నారు. మొత్తం ధాన్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, తిప్పని శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు గడ్డం హన్మండ్లు, గోసుకుల రవి, డప్పుల అశోక్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేశ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

