రైతు ఆశీర్వాద సభా స్థలం పరిశీలన
ఈ నెల 9న భారీ బహిరంగ సభ
కాకతీయ, ముదిగొండ : ఈ నెల 9న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద’ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ముదిగొండ మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపూడి బుచ్చి రామయ్య ఆధ్వర్యంలో నాయకులు సభా స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో జరగనున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సభకు రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు మరియు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయాలని వారు కోరారు.

