సైబర్ మోసగాళ్ల వలలో చేర్యాల ఆర్ఐ..
* భయపెట్టి రూ. లక్ష కాజేసిన కేటుగాళ్లు
కాకతీయ,చేర్యాల: చేర్యాల తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.1 లక్ష కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ కేసును ప్రస్తావిస్తూ, “మీరు కూడా లంచాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.. మేము సైబర్ క్రైమ్ అధికారులం” అని ఫోన్ చేసి బెదిరించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆర్ఐని నమ్మించారు.
తమపై కేసు నమోదు అవుతుందనే భయంతో ఆర్ఐ వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేసినట్లు సమాచారం. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన ఆర్ఐ కొమురవెల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తన పేరు బయటకు రాకుండా చూడాలని కూడా పోలీసులను కోరినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారికంగా పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

