ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 10న ‘జైల్ భరో’
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్
చేర్యాలలో సీఐటీయూ, రైతు సంఘాల మండల సదస్సు
“క్విట్ కార్పొరేట్” నినాదంతో కదలిరావాలని పిలుపు
కాకతీయ, చేర్యాల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం చేర్యాలలో నిర్వహించిన సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మండల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టనున్న “క్విట్ కార్పొరేట్ – జైల్ భరో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కీలకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఎరువులు, పురుగుమందుల ధరలు అమాంతం పెరగడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నారు.
నిరసనల్లో భాగస్వాములు కావాలి
“కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టేందుకు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి” అని సత్తిరెడ్డి కోరారు. ఆగస్టు 10న చేపట్టే జైల్ భరో కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

