అడుగంటుతున్న ఎల్ఎండీ
ప్రస్తుత నీటి నిల్వ కేవలం 5.635 టీఎంసీలే
వర్షాభావంతో ఎగువ నుంచి ఆగిపోయిన వరద ప్రవాహం
సాగు, తాగునీటి కష్టాలపై ఆందోళన చెందుతున్న రైతులు, నగరవాసులు
ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలు
కాకతీయ, కరీంనగర్ : జిల్లా జీవనాడి, ప్రధాన జలవనరు అయిన లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో, జలాశయం దిక్కుచూపుగా మారుతోంది. 24 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలో, ప్రస్తుతం కేవలం 5.635 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఎగువ ప్రాంతాల నుంచి ఎల్ఎండీలోకి వచ్చే వరద ప్రవాహం దాదాపు నిలిచిపోయింది. జలాశయం నిండక పోవడంతో, ఖరీఫ్ సీజన్ సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు, వర్షాల కోసం ఎదురుచూస్తూ ఆందోళనలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లోనూ వర్షాలు కురవకపోతే, సాగునీటి ఎద్దడి తీవ్రతరమై పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు.
నగరవాసుల్లోనూ ఆందోళన..
కేవలం సాగునీటికే కాకుండా, కరీంనగర్ నగరానికి తాగునీరు అందించే ప్రధాన వనరు కూడా ఎల్ఎండీయే. డ్యాంలో నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుతుండటంతో, రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తవచ్చన్న భయం నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలాశయంలోకి భారీగా వరదనీరు చేరితేనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, ప్రజల దృష్టి అంతా ఆకాశం వైపే నిలిచింది. ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురవకపోతే, సాగు, తాగునీటి సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. స్థానిక రైతులు, ప్రజలు ముందస్తుగా అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

