- ‘మద్యం దందాలో సిండికేట్ రాజ్’ కథనంపై ఎక్సైజ్ శాఖ స్పందన

కాకతీయ, కారేపల్లి: ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు జరగాలని, అధిక ధరలు వసూలు చేసినా, అక్రమంగా మద్యం తరలించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ ప్రశాంతి హెచ్చరించారు. కారేపల్లి మండలంలో మద్యం విక్రయాల్లో సిండికేట్ దందా, ఎమ్మార్పీకి మించి ధరల వసూళ్లు, గ్రామాలకు ఆటోల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతోందంటూ ‘మద్యం దందాలో సిండికేట్ రాజ్’ శీర్షికతో కాకతీయలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. కథనం వెలువడిన మరుసటి రోజే శుక్రవారం ఎక్సైజ్ సీఐ ప్రశాంతి, ఎస్ఐ డి. వసంత కారేపల్లిలోని వైన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఎమ్మార్పీ అమలు, విక్రయ విధానం, స్టాక్ వివరాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కారేపల్లి మండలంలోని కొన్ని వైన్ షాపుల్లో ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు లభిస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మార్పీకి మించి విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. కాకతీయలో కథనం ప్రచురితమైన వెంటనే ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలో సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి, వినియోగదారుల హక్కులను పరిరక్షించేలా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.

