అంతర్జిల్లా సీరియల్ దొంగ అరెస్ట్
వరుస దేవాలయాల చోరీలకు తెర
రెండు కేసులు ఛేదించిన రామడుగు పోలీసులు
బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం
మరిన్ని చోరీలపై దర్యాప్తు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దేవాలయ చోరీలను పోలీసులు ఛేదించారు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన అంతర్జిల్లా సీరియల్ హౌస్బ్రేకర్ ఎం.ఏ. అర్షద్ ఖాన్ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, కరీంనగర్లో కూలీగా పనిచేస్తున్న అర్షద్ ఖాన్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. జూలై 25, 26 తేదీల్లో వెదిర గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ మార్కండేయ స్వామి దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు, హుండీ నగదును దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి మూడు వెండి కిరీటాలు, నాలుగు వెండి జంజీరాలు, బంగారు పుస్తెలు, రూ.9,500 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. జ్యువెలరీ దుకాణంలో విక్రయించిన మరికొన్ని ఆభరణాలను కూడా రికవరీ చేశారు.
పలుచోట్ల చోరీలు చేసినట్లు అంగీకారం
విచారణలో నిందితుడు చిగురుమామిడి, ఎల్ఎండీ కాలనీ, రామడుగు, చొప్పదండి, గంగాధర పోలీస్స్టేషన్ల పరిధిలోని దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. చోరీ సొత్తును పలు జ్యువెలరీ దుకాణాల్లో విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలు, మద్యపానానికి ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులను అదనపు డీసీపీ అభినందించారు.

