మానేరు నీటిమట్టంపై అధికారుల నిఘా
మరో మూడు రోజుల్లో మత్తడి దూకే అవకాశం
పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ మారుతి రెడ్డి
కాకతీయ, గంభీరావుపేట : మండలంలోని ఎగువ మానేరు జలాశయాన్ని గంభీరావుపేట తహసీల్దార్ మారుతిరెడ్డి మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఆయన సమీక్షించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువ మానేరులోకి గణనీయంగా వరద నీరు చేరుతోందని తహసీల్దార్ తెలిపారు. దీంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న మూడు రోజుల్లో మత్తడి దూకే అవకాశం ఉందన్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ శాఖ ఈఈ ప్రశాంత్, డీఈ నర్సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నికిత తదితరులు పాల్గొన్నారు.

