ప్రైవేట్ స్కూళ్లకు అండెవరిది..?
ఏన్కూర్లో ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం
యూనిఫామ్లు, పుస్తకాల కొనుగోళ్లలో కమిషన్ ఆరోపణలు
విద్యాశాఖ మౌనంపై అనుమానాలు
కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణ కోరుతున్న బాధితులు
కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఓ ప్రైవేట్ పాఠశాల భారీ ఫీజులతో పాటు యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల కొనుగోలులోనూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం సూచించిన దుకాణాల్లోనే యూనిఫామ్లు, పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం వస్త్ర, పుస్తక దుకాణాలతో కమిషన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అమలవుతున్నాయా..?
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, బలవంతపు కొనుగోళ్లను అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ తనిఖీలు నిర్వహించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలకు అధికారుల అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని మండలంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణం, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల విక్రయ విధానాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు.

