ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
అత్యుత్తమ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు
ప్రతిపాదనలను త్వరితగతిన అమలు దశకు తీసుకురావాలి
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లాలోని సహజసిద్ధమైన నీటి వనరులు, చెరువులు, సరస్సులను పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటి వనరులు, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం బోనకల్, మధిర మండలాల్లో పర్యటించిన కలెక్టర్ కలకోట పెద్దచెరువు, మడుపల్లి, మధిర ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతలో లోపాలు తలెత్తితే సహించేది లేదన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో ఉపాధి
మధిర రివర్ఫ్రంట్ను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మధిర ట్యాంక్బండ్ వద్ద కాటేజీలు, రిసెప్షన్, కిచెన్, రెస్టారెంట్, విద్యుదీకరణ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కలకోట పెద్దచెరువు వద్ద కాటేజీలు, కేఫెటీరియా, పార్కింగ్ తదితర సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానికులకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతిపాదనలను త్వరగా ఖరారు చేసి అమలు దశకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. రహదారులు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక అభివృద్ధికి భూమి అవసరమైన చోట భూసేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి బి. సుమన్ చక్రవర్తి, తహసీల్దార్లు రాంబాబు, బోనకల్ తహసీల్దారు, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

