భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం
భూ రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
సర్వే మ్యాప్తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
సెప్టెంబర్ 15లోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, జగిత్యాల : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాను సెప్టెంబర్ 15లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హతే ప్రామాణికంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధి చేకూర్చాలని సూచించారు. రాష్ట్రంలో చేపడుతున్న భూ రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, ప్రతి భూ యజమానికి సర్వే మ్యాప్ అందిస్తే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆరు కార్యాలయాల నిర్మాణానికి రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అర్హతకే పెద్దపీట
జిల్లాలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని పొంగులేటి సూచించారు. ఎల్1, ఎల్2, ఎల్3 వంటి సాంకేతిక వర్గీకరణల కంటే లబ్ధిదారుల అర్హతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. నిజమైన పేదలకు ఇళ్లు అందేలా శాసనసభ్యులు, ఇన్చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. రెండో విడతలో ఒక్క అర్హ కుటుంబం కూడా మిగిలిపోకుండా మరోసారి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పారదర్శకంగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 15లోగా తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 10,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 8,079 మంది లబ్ధిదారులకు రూ.227.32 కోట్లు విడుదలైనట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించారు. చెరువులో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
మ్యాప్తో వివాదాలకు చెక్
రాష్ట్రంలో చేపడుతున్న భూ రీ సర్వే అత్యంత కీలకమైన కార్యక్రమమని మంత్రి పొంగులేటి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే లక్ష్యమని, అధికారులు పూర్తి బాధ్యతతో పకడ్బందీగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత భూ యజమానులకు మ్యాప్ అందిస్తే భవిష్యత్లో వివాదాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. భూ రీ సర్వే రెవెన్యూ శాఖలో కొత్త శకానికి నాంది పలికే కార్యక్రమమని, కలెక్టర్లకు ఇది అనుభవంతో కూడిన ఉన్నత సవాలని అన్నారు. సర్వే నిర్వహించే సర్వేయర్లకు నిర్ణీత మొత్తాన్ని ప్రతి 15 రోజులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్లో కొత్త విధానాలు
రిజిస్ట్రేషన్ శాఖలో పాత తరహా విధానాలకు స్వస్తి పలికి ప్రజలకు మరింత సులభతరంగా, పారదర్శకంగా సేవలు అందించే కొత్త విధానాలను తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసైన్డ్ భూముల అంశంపై శాసనసభలో విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో తొలి దశలో రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో పాఠశాల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తామన్నారు. కాలనీలో రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆధునిక వసతులతో నిర్మించే కొత్త కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

