నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు
క్రేన్లు, గజ ఈతగాళ్లు, బోట్లు సిద్ధంగా ఉంచాలి
నిమజ్జన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం దంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. చెరువులో నీటిమట్టం దృష్ట్యా బారికేడింగ్, గజ ఈతగాళ్లు, క్రేన్లు, బోట్లు, రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రి నిమజ్జనాలకు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎత్తైన విగ్రహాల తరలింపునకు ప్రత్యేక రూట్, ట్రాఫిక్, పోలీసు బందోబస్తు, రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు, షార్ట్సర్క్యూట్ జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద మెడికల్ క్యాంపులు, 108 వాహనం, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించాలని, క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండాలని, అడ్డుగా వచ్చే చెట్టు కొమ్మలను ముందుగానే తొలగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, నీటిపారుదల శాఖలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేసి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

