ఫుట్పాత్లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..
* మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ హెచ్చరిక
కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణంలో పెరిగిన జనాభా, వాహనాల వల్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్ పాత్ ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా రోడ్డుపైనే తోపుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైనే వాహనాల నిలపడం, దుకాణాల ఎదుట పార్కింగ్ చేయడంతో రోడ్డు మీదుగా వెళ్లేవారు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదలకు గురై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు, ఆసుపత్రులకు వచ్చేవారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఉండడంవల్ల పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్ అక్రమించుకొని వ్యాపారం నిర్వహించడం వల్ల ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ఫుట్ పాత్ పై వ్యాపారం నిర్వహిస్తున్న వాటిని వెంటనే తొలగించుటకు పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాదచారుల హక్కులను కాలరాస్తూ ఫుట్పాత్లపై వ్యాపారాలు సాగిస్తే సహించేది లేదని, ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా వ్యాపారస్తులు ఫుట్ పాత్ పై వ్యాపారాలను నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ అరుణ స్పష్టం చేశారు.

పోలీసుల పనితీరు బేస్
పట్టణంలో పోలీసులు చక్కని పనితీరును కనబరుస్తున్నారు. చేతిలో ట్యాబ్ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తూ ఫైన్లు వేస్తున్నారు. రాంగ్ రూట్లో వాహనాలను నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన, ఫోటోలు కొట్టి ఫైన్లతో వాతలు పెడుతూ ప్రజల్లో మాత్రం భయం ఉంచారు.

