కారేపల్లిలో ‘డీజిల్’ గండం..
ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి!
బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. గంటల తరబడి నిరీక్షణ
హార్వెస్టర్ యజమానుల షరతులతో రైతులపై అదనపు భారం
స్తంభించిన రవాణా వ్యవస్థ.. నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల లారీలు
అకాల వర్షాల భయంతో రైతాంగం ఆందోళన
కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండల పరిధిలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డీజిల్ కొరత ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు వేసవి ఎండలు ముదురుతుండటం, మరోవైపు మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఇంధనం దొరక్కపోవడం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మండల కేంద్రంలోని గొల్లగూడెం పెట్రోల్ బంకు వద్దకు డీజిల్ కోసం కిలోమీటర్ల మేర వాహనాలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం మండలంలో మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. అయితే, కోత మిషన్ల (హార్వెస్టర్ల) యజమానులు డీజిల్ బాధ్యతను రైతులపైనే నెట్టేస్తున్నారు. “బంకుల్లో స్టాక్ ఉండటం లేదు. మీరే డీజిల్ తెచ్చి పోస్తేనే మేము పంట కోస్తాం, లేదంటే మిషన్లు కదిలించలేం” అని తెగేసి చెబుతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఇతర పనులు మానుకుని, తెల్లవారుజాము నుంచే ప్లాస్టిక్ క్యాన్లతో బంకుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ సంక్షోభం ప్రభావం రవాణా రంగంపై కూడా పడింది. ఇతర రాష్ట్రాల నుంచి సరుకుతో వస్తున్న లారీలు గొల్లగూడెం సమీపంలోనే నిలిచిపోయాయి. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేక ప్యాసింజర్ ఆటోలు కూడా పక్కన చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం కష్టంగా మారింది.
తక్షణ చర్యలు తీసుకోవాలి
ఆకాశంలో మబ్బులు కనిపిస్తుండటంతో, ఎక్కడ అకాల వర్షం కురిసి పంట తడిసిపోతుందోనని రైతులు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట, కేవలం డీజిల్ లేకపోవడం వల్ల కళ్ల ముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని, బంకులకు అదనపు స్టాక్ సరఫరా అయ్యేలా చూడాలని, వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకోవాలని ‘కాకతీయ’ డిమాండ్ చేస్తోంది.

