42 రోజుల దీక్ష విరమణ..
‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్పై ప్రభుత్వం వెనక్కి!
ప్రభుత్వంతో చర్చించి విజయం సాధించిన వొడితల
హుజూరాబాద్ ప్రజల కోసం అండగా ఉంటానన్న ఇంచార్జి
హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ శివారులో ప్రతిపాదించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ స్థల మార్పిడి కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, స్థల మార్పిడికి ఒప్పించడంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి జేఏసీ నాయకులతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ప్లాంట్ విషయంలో స్థానిక ప్రజల ఆందోళనను జిల్లా మంత్రులతో పాటు ఇంచార్జి మంత్రికి వివరించినట్లు తెలిపారు. “హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని పట్టుబట్టి ప్రభుత్వ పెద్దల మనసు మార్చడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి హుజూరాబాద్లో ఎలాంటి ప్రతిపాదనలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. హుజూరాబాద్ బిడ్డగా ఈ ప్రాంతానికి పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం సేవ చేస్తానని, భవిష్యత్తులో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం..
ప్రజలకు హాని చేసే ఏ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ప్రణవ్ వెల్లడించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దీక్ష ప్రారంభమైన రెండో రోజే ప్రణవ్ బాబు సంఘీభావం తెలిపి, అన్న మాట ప్రకారం ప్రాజెక్టును నిలిపివేయించారని జేఏసీ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయంతో హుజూరాబాద్ పట్టణ ప్రజలు మరియు జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, 42 రోజులుగా తమ పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

