కోయచలకలో కరెంట్ సెగ.. రైతుకు కన్నీరు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఎకరం వరి పంట దగ్ధం
అప్రమత్తమైన కాపరులు.. మరో ఎకరం సేఫ్
చేతికొచ్చే వేళ అగ్నికి ఆహుతి.. ఆవేదనలో రైతు
కాకతీయ, రఘునాథపాలెం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. మరో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో అగ్నిప్రమాదం ఆ రైతు ఆశలను బూడిద చేసింది. ఖమ్మం జిల్లా కోయచలక గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మడుపు బ్రహ్మయ్య అనే రైతుకు చెందిన ఎకరం వరి పంట పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ తీగల రాపిడితో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బ్రహ్మయ్య పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పురవ్వలు ఎండిన వరి పంటపై పడ్డాయి. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే పొలమంతా వ్యాపించాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్లముందే అగ్నికి ఆహుతవుతుంటే రైతు బ్రహ్మయ్య కన్నీరుమున్నీరయ్యారు.
మంటలను గమనించిన సమీపంలోని మేకల కాపరులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేకలు వేస్తూ గ్రామస్తులను పిలిచి, చెట్ల కొమ్మలు, మట్టితో మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. వారి సమయస్ఫూర్తి వల్ల మంటలు పక్కనే ఉన్న మరో ఎకరం పొలానికి వ్యాపించకుండా ఆగిపోయాయి. లేనిపక్షంలో నష్టం మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు. “అప్పులు చేసి, ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే.. కోత కోసే లోపే ఇలా బూడిదైపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?” అని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆర్థికంగా చితికిపోయిన బ్రహ్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

