వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
పంటను కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం
జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా అన్నదాతలకు జరుగుతున్న మేలు శూన్యం
బస్తాల నుంచి లారీల వరకు రైతులు కిరాయిలు చెల్లించే దుస్థితి
పోరాటంతోనే కేంద్రాలు వచ్చాయి.. కదిలితేనే బస్తాలు కదులుతాయి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
కాకతీయ, బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు ఘాటుగా విమర్శించారు. ఆదివారం బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం, రావినూతల సొసైటీ పరిధిలో కల్లాలలో నిల్వ ఉన్న మొక్కజొన్నలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరిస్తూ.. కొనుగోలు కేంద్రాలు ఉన్నా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, బస్తాలు, లారీలు తామే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రైతుల సమస్యలను సావధానంగా విన్న సుదర్శన్ రావు, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఉపన్యాసాలు తప్ప చేతలు లేవు
కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి గింజను కొంటామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుదర్శన్ రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా చోట్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. లారీ డ్రైవర్లు బస్తాకు 40 రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి కళ్ళు లేవా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప, రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటాలకు సిద్ధం కావాలి
వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు వణికిపోతుంటే ప్రభుత్వం చలించకపోవడం బాధాకరమని సుదర్శన్ రావు పేర్కొన్నారు. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులకు జరిగిన ఉపయోగం శూన్యమన్నారు. యూరియా కొరత, కొనుగోలు కేంద్రాల కొరతతో రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయని, మళ్లీ పోరాడితేనే బస్తాలు కదులుతాయని.. అన్నదాతలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొంతు రాంబాబు, దొండపాటి నాగేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు, కిలారు సురేష్, మంద కరుణ, కొమ్ము కమలమ్మ, మాదినేని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

