ప్రభుత్వ పాఠశాలల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టెన్త్ టాపర్ల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి
పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు 10వేల చొప్పున నగదు ప్రోత్సాహం
ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
కాకతీయ, పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు ప్రజలకు విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతి ప్రభుత్వ హైస్కూల్ పరిధిలో టాపర్ విద్యార్థుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల ఘనత
ఈ సందర్భంగా విప్ విజయరమణారావు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 98 మందికి పైగా ఉండటం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లను అభినందించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మరమ్మతులు, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు వంటి పనులను ప్రత్యేక నిధులతో పూర్తి చేశామన్నారు. ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న తెనుగువాడ పాఠశాలను పూర్తిగా పునరుద్ధరించి, నేడు ప్రైవేటుకు దీటుగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. పట్టణ, గ్రామీణ పరిధిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ వారం రోజుల్లో భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
టాప్ 11 మంది విద్యార్థులకు నగదు చెక్కుల పంపిణీ
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన శాతాన్ని నమోదు చేశారన్నారు. టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్లో తమ ఆసక్తులకు అనుగుణమైన కోర్సులు ఎంచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఇంటర్ దశలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘనంగా సన్మానించి, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, విద్యాశాఖ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

