భర్తపై భార్య వేటకొడవలితో హత్యాయత్నం!
వివాహేతర సంబంధం అడిగినందుకు ఘాతుకం
తీవ్ర గాయాలైన బాధితుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించిన స్థానికులు
భార్య, ప్రియుడిపై కేసు నమోదు.. నిందితులు పరారీ
కాకతీయ, కూసుమంచి: వివాహేతర సంబంధంపై నిలదీసిన భర్తపై భార్య వేటకొడవలితో దారుణంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూసుమంచి మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొరిలాపాడు గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం గొరిలాపాడు గ్రామానికి చెందిన భానోత్ వీరన్నకు మునిగేపల్లి గ్రామానికి చెందిన రాంబాబుతో స్నేహం ఉంది. ఈ క్రమంలో రాంబాబు తరచూ వీరన్న ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఈ నేపథ్యంలో వీరన్న భార్య రుక్కమ్మతో రాంబాబుకు చనువు పెరిగి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి వ్యవహారం వీరన్నకు తెలియడంతో గత కొంతకాలంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ తీవ్ర గొడవలు జరుగుతున్నాయి.
వేటకొడవలితో దాడి
మంగళవారం రాత్రి కూడా వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రుక్కమ్మ.. ఇంట్లో ఉన్న వేటకొడవలితో భర్త వీరన్న తలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుధవారం ఉదయం సమయంలో నెత్తుటి మరకలు, తీవ్ర గాయాలతో పడి ఉన్న వీరన్నను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించి, అతడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడి బంధువు భానోత్ వాసు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం నిందితులు రుక్కమ్మ, రాంబాబు ఇద్దరూ పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.

