రోగుల ప్రాణాలతో చెలగాటమా..?
బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగి ఆవేదన..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల పనితీరుపై విమర్శలు
కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఈ నెల 27న ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ చేయించుకోగా, మరుసటి రోజున రిపోర్టు అందిస్తామని సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రిపోర్టు సిద్ధమైన తర్వాత మొబైల్కు మెసేజ్తో పాటు లింక్ కూడా వస్తుందని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మెసేజ్ గానీ, సమాచారం గానీ అందలేదని వాపోయారు. అయితే రెండు రోజులు గడిచినా ఇప్పటివరకు రిపోర్టు అందకపోవడంతో పాటు సంబంధిత సిబ్బంది నుంచి సరైన స్పందన కూడా లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై 28వ తేదీన హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శ్రావణ్ కుమార్ను ప్రశ్నించగా, బక్రీద్ పండుగ కారణంగా సిబ్బంది రాలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం 29వ తేదీన తిరిగి ఆసుపత్రికి వెళ్లి విచారించగా సంబంధిత సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వైద్యం కోసం వస్తుంటే, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం..?
రిపోర్టుల కోసం తిరుగుతూ ప్రైవేట్ దవాఖానల బాట పట్టిన రోగులు
ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన హరీష్ చివరికి ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించి మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి రిపోర్టులు అందకపోవడం, మొబైల్కు సమాచారం పంపుతామని చెప్పి స్పందించకపోవడం వల్ల ప్రజలు అదనపు ఖర్చులతో ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే రోగుల ప్రాణాలే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రోగులకు సకాలంలో పరీక్షా రిపోర్టులు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

