ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో చైతన్యం
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
వ్యవసాయ రంగంలో పంట మార్పిడికి ప్రాధాన్యత
గంభీరావుపేట తహసిల్దార్ మారుతి రెడ్డిప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ధి
కాకతీయ,గంభీరావుపేట: ప్రజా భాగస్వామ్యంతో ఆయా గ్రామాల అభివృద్ధి సాధ్యమని గంభీరావుపేట తహసిల్దార్ మారుతి రెడ్డి శనివారం పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల తోడ్పాటు ఉంటే గ్రామాల ప్రగతి తేలికగా సాధ్యమవుతుందన్నారు. గ్రామ ప్రగతికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అవసరమని ఆయన వివరించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బడిబాట, ఘన వ్యర్థాల నిర్వహణ, ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, విపత్తుల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ వాహనానికి అందించాలని, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో కూరగాయలు, తృణధాన్యాలు వంటి లాభదాయక పంటలు సాగు చేయాలని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

