డ్రగ్స్కు దూరంగా.. భవిష్యత్తుకు దగ్గరగా!
కేజీబీవీ విద్యార్థినులకు చందుర్తి పోలీసుల ‘ఓపెన్ హౌస్’
పోలీసులతో ముఖాముఖి.. సందేహాల నివృత్తి
కాకతీయ,చందుర్తి : విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా “ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి స్థానిక ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, అలవాట్లు జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయన్నారు. డ్రగ్స్ బారిన పడితే చదువుతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, సామాజిక గౌరవం తీవ్రంగా దెబ్బతింటాయని విద్యార్థినులకు వివరించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను మూలాలతో సహా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెంచిందని ఎస్ఐ రమేష్ తెలిపారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు, డిజిటల్ మానిటరింగ్, సైబర్ నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
పోలీసులతో ముఖాముఖి.. సందేహాల నివృత్తి
ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను సందర్శించి, అక్కడి రికార్డుల నిర్వహణ, ఆయుధాలు, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలీసుల విధులు, బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులతో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. “డ్రగ్స్కు నో చెప్పండి… మీ కలలకు అవును చెప్పండి” అనే బలమైన సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో మంచి స్పందనను రేకెత్తించింది. భవిష్యత్తులో కూడా యువతను తప్పుదోవ పట్టకుండా కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

