మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి
కౌలు రైతులను గుర్తించి పథకాలు అమలు చేయాలి
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్
కాకతీయ, ఖమ్మం : జిల్లాలో మొక్కజొన్న పంట దిగుబడులు ఎక్కువగా వచ్చినప్పటికీ, ప్రభుత్వ కొనుగోళ్లు సరైన స్థాయిలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎకరానికి 50 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా కేంద్ర ప్రభుత్వం కేవలం 26 క్వింటాళ్లకే కొనుగోలు పరిమితి విధించడం అన్యాయమని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల కొరతతో పాటు నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు తమ పంటను నిల్వ ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోలు పరిమితులను పూర్తిగా ఎత్తివేసి రైతు వద్ద ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, మొత్తం రైతుల్లో సుమారు 36 శాతం కౌలు రైతులే ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. రైతు భరోసా వంటి పథకాల కింద భూ యజమానుల ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమ కావడం సరైంది కాదని, నిజంగా సాగు చేస్తున్న కౌలు రైతులకే ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతుల సంరక్షణ కోసం తీసుకువచ్చిన 2011 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, వచ్చే వ్యవసాయ సీజన్ నాటికైనా కౌలు రైతులను గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు సిహెచ్ శిరోమణి, కే శ్రీను, శోభ, లక్ష్మణ్, దేవలప్పారావు, దరావత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

