28న కరీంనగర్లో ‘విద్యా సదస్సు’..
ముఖ్య వక్తగా ‘వీక్షణం’ సంపాదకుడు ఎన్. వేణుగోపాల్
కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆవాల నరహరి
కాకతీయ, కరీంనగర్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రాజిరెడ్డి ఉద్యోగ విరమణను పురస్కరించుకుని ఈ నెల 28న కరీంనగర్లో నిర్వహించనున్న విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి పిలుపునిచ్చారు. జమ్మికుంటలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. ‘తెలంగాణ విద్యా రంగం – వర్తమానం, భవిష్యత్తు, సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రైవేటీకరణ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రముఖ విశ్లేషకులు, ‘వీక్షణం’ పత్రికా సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తారని వెల్లడించారు. సదస్సు అనంతరం రాజిరెడ్డి అభినందన సభ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి హేమలత, డీటీఎఫ్ మండల అధ్యక్షుడు బి. వేణుగోపాల్, నాయకులు హరీష్ కుమార్, అనూష, పద్మ, బలరాం తదితరులు పాల్గొన్నారు.

