విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
షార్ట్ సర్క్యూట్తో గేదెకు తీవ్ర గాయాలు.. గడ్డి కట్టలు దగ్ధం
బాధిత రైతును ఆదుకోవాలని డిమాండ్
కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామం నల్లల బావి సమీపంలో లూజ్ వైర్ల కారణంగా ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాజాగా ఇందుర్తికి చెందిన నర్సింగోజు రాజమౌళి పశువుల పాక వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి రూ. 1.20 లక్షల విలువైన చూడి గేదె 80 శాతం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉందన్నారు. ఈ ప్రమాదంలో పాక వద్ద ఉన్న దాదాపు 500 గడ్డి కట్టలు కాలి బూడిదయ్యాయని, గతంలోనూ ఇక్కడ మోటర్లు, పైపులు కాలిపోయాయని రైతులు తెలిపారు. లూజ్ వైర్ల సమస్యను రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి లూజ్ వైర్లను సరిచేయాలని, తీవ్రంగా నష్టపోయిన రైతు రాజమౌళిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని తోటి రైతులు కూన పెద్దన్న, బుర్ర శ్రీనివాస్, బందెల శ్రీనివాస్, సంధవేని మల్లయ్య తదితరులు డిమాండ్ చేశారు.

