కుక్కల రాజ్యమా?.. కొత్తగూడెం మున్సిపాలిటీనా..?
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం.. జనాల ప్రాణాలకు సంకటం!
లక్షల నిధులున్నా కుక్కల నియంత్రణ శూన్యం.. కార్పొరేషన్ తీరుపై జనాగ్రహం
మహిళ ప్రాణం పోయినా కదలని మున్సిపల్ ‘సార్లు’.. ఏమైంది మీ నిఘా?
వీధుల్లో శునకాల స్వైరవిహారం.. కౌన్సిల్ సమావేశాల ముచ్చట్లకే పరిమితమైన పాలకులు!
కమిషనర్ గారూ.. ఆసుపత్రుల్లో కుక్కల హల్చల్ మీకు కనిపించడం లేదా?
చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రజా సంఘాల హెచ్చరిక

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారుల నిరంకుశ వైఖరి, తీవ్ర నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రంలో సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. పట్టణంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదపై మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. కార్పొరేషన్ పరిధిలోకి మారిన తర్వాత కోట్లాది రూపాయల నిధులు, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల కనీస ప్రాణ రక్షణపై లేకపోవడం ఇక్కడి అధికారుల చేతకానితనానికి అద్దం పడుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలంలో వీధి కుక్కల దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయి రోజులు గడుస్తున్నా.. మున్సిపల్ అధికారులు కనీసం స్పందించిన పాపాన పోలేదు. కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీలో ప్రత్యేక విభాగాలు, నిధులు ఉన్నప్పటికీ.. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్పొరేషన్ నిధులు ఏమౌతున్నాయి..?
కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సమస్యలన్నీ తీరుస్తామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకున్నారు. మరి ఏటా కుక్కల నియంత్రణ (స్టెరిలైజేషన్), వ్యాక్సినేషన్ కోసం కేటాయిస్తున్న బడ్జెట్ నిధులు ఏమైపోతున్నాయని పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు. పట్టణంలోని ప్రతి గల్లీలోనూ, ప్రధాన కూడళ్లలోనూ పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కేవలం సొంత ఎజెండాలు, కాంట్రాక్టుల గురించే చర్చలు జరుపుతున్నారే తప్ప.. ప్రజలను వేధిస్తున్న ఇరుసు వంటి కుక్కల సమస్యపై ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
దవాఖానాల్లో కుక్కల రాజ్యం..
సాధారణ వీధులను వదిలేస్తే.. కనీసం రామవరం మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కూడా కుక్కల రాజ్యం నడుస్తుంటే మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. పుట్టిన పసికందులు, గర్భిణీలు ఉండే వార్డుల లోపలికి కుక్కలు వస్తున్నా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కుక్కలను పట్టుకునే టీమ్లు కొత్తగూడెం మున్సిపాలిటీలో మచ్చుకైనా కనిపించడం లేదు. కేవలం కాగితాల్లో బిల్లులు డ్రా చేసుకోవడానికే కుక్కల నియంత్రణ పథకాలను వాడుకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్రమత్తు వీడి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కల బెడద నుండి పట్టణాన్ని కాపాడాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్వత్రా హెచ్చరిస్తున్నారు.

