భూ రీ-సర్వేను సమగ్రంగా నిర్వహించాలి
రైతుల సమక్షంలోనే సరిహద్దుల నిర్ధారణ జరగాలి
సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలి
పొరపాట్లకు తావు లేకుండా సాంకేతికతతో రికార్డుల నవీకరణ
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
కాకరవాయి గ్రామంలో సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన
కాకతీయ, మయూరి సెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమగ్రంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో శనివారం పాలేరు నియోజకవర్గ విస్తృత పర్యటనలో భాగంగా కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును పరిశీలిస్తూ రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
వివాదాల్లేకుండా పక్కాగా సరిహద్దులు
ప్రతి పట్టాదారు భూమిని సంబంధిత భూ యజమానులు, రైతుల సమక్షంలోనే సర్వే చేసి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థులు అడిగే ప్రతి సందేహానికి వెంటనే సమాధానం ఇచ్చి వారిలో అవగాహన, విశ్వాసం కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా पाటిస్తూ భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, అధునాతన సాంకేతిక ప్రమాణాలతో నాణ్యమైన సర్వే నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అనంతరం తిరుమలాయపాలెం మండలంలో సీతారామ ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను బీరోల్ వద్ద కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఇర్రిగేషన్ డీఈ రమేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుధీర్, సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

