వృద్ధాశ్రమ భూమిలో సబ్స్టేషన్కు మళ్లీ వివాదం
ఎమ్మెల్యే, తహశీల్దార్ హామీ అమలు కాలేదని ట్రస్ట్ సభ్యుల ఆవేదన
ఆశ్రమ ప్రాంగణంలోనే దీక్ష.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో చార్వాక వృద్ధాశ్రమానికి కేటాయించిన ఐదెకరాల భూమిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఆశ్రమ ప్రాంగణంలోనే దీక్షకు దిగిన వారు, గతంలో ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. ట్రస్ట్ సభ్యుల కథనం ప్రకారం, 2017లో వృద్ధాశ్రమం కోసం ఐదెకరాల భూమి కేటాయించారు. గత మేలో అదే స్థలంలో సబ్స్టేషన్ నిర్మాణానికి అధికారులు హద్దులు పాతే ప్రయత్నం చేయడంతో ఆందోళన చేపట్టగా, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచనల మేరకు తహశీల్దార్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని, భూమికి హద్దులు నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో దీక్ష విరమించారు. అయితే, ఇటీవల అధికారులు మళ్లీ జేసీబీలతో వచ్చి బోరు తవ్వేందుకు ప్రయత్నించారని ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ వృద్ధాశ్రమ స్థలాన్నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విమర్శించారు. హామీ అమలు చేసి వృద్ధాశ్రమ భూమిని పరిరక్షించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ట్రస్ట్ సభ్యులు హెచ్చరించారు.

