నమ్మినందుకు నట్టేటే ముంచేశారా..?!
రూ.30 లక్షల స్థలంపై వివాదం.. చివరకు బాధితుడి ఆత్మహత్యాయత్నం..!
ప్రశ్నిస్తే దాడి.. తిరిగి బాధితుడిపైనే కేసు నమోదైందని ఆరోపణ
న్యాయం చేస్తామన్న పెద్దమనుషులూ మోసమే చేశారంటూ ఆవేదన
స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : పైసా పైసా కూడబెట్టి, తెలిసినవారి వద్ద అప్పులు చేసి రూ.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలం చివరకు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థలం కొనుగోలు చేసిన నాటి నుంచే సమస్యలు ఎదురవడంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, పెద్దమనుషుల చుట్టూ తిరిగిన బాధితుడికి ఎక్కడా న్యాయం జరగలేదనే మనస్తాపంతో జ్వరం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన జి. నవీన్ టెంట్హౌస్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి తన భార్య పేరు మీద ఉన్న ఆరున్నర గుంటల స్థలాన్ని రూ.30 లక్షలకు నవీన్కు విక్రయించాడు. ఏడాది క్రితం స్థలానికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లగా ఓ వ్యక్తి అడ్డుకుని, సదరు స్థలంలో మూడు గుంటల భూమిని తాను 12 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశానంటూ పత్రాలు చూపించాడు. దీంతో నవీన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వాస్తవానికి అమ్మిన వ్యక్తికి కేవలం మూడు గుంటలే ఉండగా, తప్పుడు పత్రాలు సృష్టించి బాధితుడికి ఆరున్నర గుంటలు విక్రయించినట్లు తెలిసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
ప్రశ్నిస్తే కేసు…
తనకు స్థలం విక్రయించిన వ్యక్తిని నవీన్ ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, తనకు న్యాయం చేయాలని నిలదీయడంతో కృష్ణతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నాడు. అనంతరం తిరిగి తనపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని వాపోతున్నాడు.ఈ స్థల వివాదంపై గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయని బాధితుడు చెబుతున్నాడు. సమస్య పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారే తప్ప న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నాడు. పెద్దమనుషులు సైతం మోసం చేయడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో ఎక్కడ చూసినా తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పలుమార్లు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదనే తీవ్ర మనస్తాపంతో జ్వరం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను కోరుతున్నారు.

