నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
: ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్
కాకతీయ, ఇల్లంతకుంట: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణలో వీటి పాత్ర చాలా కీలకమని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. మండలంలోని రహీమ్ ఖాన్ పేట గ్రామంలోని ఎర్ర నర్సుపల్లె పెద్దమ్మ గుడికి ఉప సర్పంచ్ గడ్డమీది పద్మ సుమారు రూ. 25 వేల విలువైన సీసీ కెమెరాల సామాగ్రిని ముదిరాజ్ సంఘ సభ్యులకు వితరణ చేశారు. ఈ కెమెరాలను శనివారం రూరల్ సీఐ నాగేశ్వరరావుతో కలిసి ఎస్సై ప్రారంభించారు.
మత్తుకు దూరంగా ఉండాలి..
ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు. దాతృత్వంతో ఆలయ భద్రత కోసం కెమెరాలు అందజేసిన ఉప సర్పంచ్ పద్మను పోలీసులు, గ్రామస్థులు అభినందించారు.
గ్రామ ప్రముఖుల హాజరు..
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కమటం లావణ్య రాములు, ఉప సర్పంచ్ గడ్డమీది పద్మ, బత్తిని మల్లయ్య, కూస రవి, కంకటి ప్రభాకర్, ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిఘా పెరగడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

