ట్రెండింగ్లోకి “సన్న సన్న బియ్యమే” ఫోక్ సాంగ్
కాకతీయ, వేములవాడ : గ్రామీణ మాస్ బీట్, జానపద శైలిలో రూపొందిన “సన్న సన్న బియ్యమే” పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మర్రికింద యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట ప్రోమోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ సాంగ్ ట్రెండింగ్లో నిలిచిందని చిత్ర యూనిట్ పేర్కొంది. అద్భుతమైన కొరియోగ్రఫీ, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ఉన్న విజువల్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట పూర్తి వెర్షన్ను రేపు విడుదల చేయనున్నట్లు ఛానల్ ప్రొడ్యూసర్ రంగు అనిల్ వెల్లడించారు. రచయిత పంబాల రమేష్ అందించిన సాహిత్యానికి, వెంకట్ అజ్మీరా మాస్ మ్యూజిక్ తోడవ్వడం పాటకు ప్రధాన బలంగా నిలిచింది. గాయనీమణులు శిరీష, గంగమణి తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. మాధురి రాథోడ్, ఈశ్వరి తమ డ్యాన్స్ స్టెప్పులతో అలరించనున్నారు. ఈ సాంగ్ నిర్మాణంలో ప్రొడ్యూసర్ రంగు అనిల్, గాయకులు శిరీష, గంగమణి, రచయిత పంబాల రమేష్, సంగీత దర్శకుడు వెంకట్ అజ్మీరా, డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వరి, కెమెరామెన్ సురేష్ సూర్య మరియు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

