కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
అంకితభావంతో పనిచేయాలి
మానాల గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు
మానాలలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నూతన గ్రామ కమిటీల బాధ్యుల సన్మానం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
కాకతీయ, వేములవాడ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ఈయల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఉమ్మడి మానాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలోని ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నేటి కాలంలో సోషల్ మీడియా పార్టీ విస్తృతికి ప్రధాన వేదికని, కార్యకర్తలు అందులో చురుకుగా ఉంటూ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. “గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లుల భారం ప్రజలకు భారంగా మారేది, నేడు కాంగ్రెస్ పాలనలో అర్హులైన వారికి ఉచిత విద్యుత్ అందుతోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆత్మగౌరవాన్ని పెంపొందించాం” అని ఆయన పేర్కొన్నారు.
మానాలకు మరో 200 ఇందిరమ్మ ఇళ్లు
గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 92 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని మోహన్ రెడ్డి వెల్లడించారు. అదనంగా మరో 200 ఇళ్లను మంజూరు చేయించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్ జలపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, మండల అధ్యక్షుడు గంగానర్సయ్య, స్థానిక నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

