- కోనరావుపేట పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం..
- పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాల గుర్తింపు..
- అనుమానితులపై నిఘా..
- సీసీ కెమెరాల ఏర్పాటుకు, గంజాయి సమాచారంపై ప్రజలకు డీఎస్పీ శ్రీనివాసులు పిలుపు..
కాకతీయ, వేములవాడ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరింత దూకుడుగా చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి, కమ్మరి పేట గ్రామాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. సంబంధిత యజమానులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి, వారి కదలికలు, వివరాలపై ఆరా తీశారు.


ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ… ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు భద్రతాభావాన్ని పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరచరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నారా అనే అంశాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామం, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాల నియంత్రణలో అవి అత్యంత కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజా జీవనానికి భంగం కలిగించే లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సై లు ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతీలాల్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

