చేర్యాలలో ‘వృక్ష’ సంహారం
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
చేర్యాల మండలంలో వృక్ష సంపద నాశనం
నోట్లతో అధికారుల నోళ్లు మూయిస్తున్న మాఫియా
పర్యావరణానికి తూట్లు.. హరితహారం లక్ష్యం గాలికి
నిఘా కరువై దళారుల దందా.. పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖలు
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
కాకతీయ, చేర్యాల : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పర్యావరణ పరిరక్షణకు వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు చేర్యాల మండలంలో అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో విలువైన వృక్షాలను దళారులు నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న చెట్లను నరికి, లారీలు మరియు ట్రాక్టర్ల ద్వారా పట్టపగలే తరలిస్తున్నా రెవెన్యూ, పంచాయతీ, అటవీ మరియు రోడ్లు-భవనాల (ఆర్అండ్ బీ) శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేకుండా జిరాయితీ భూముల్లో చెట్లను తీయకూడదు, కానీ చెరువులు, గ్రామకంఠాలు, ప్రభుత్వ స్థలాల్లోని వృక్ష సంపదను తరలిస్తున్నా అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం వెనుక పెద్ద ఎత్తున కాసులు చేతులు మారడమే కారణమని ప్రజలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.

పర్యావరణానికి తూట్లు.. హరితహారం లక్ష్యం గాలికి
పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం లక్ష్యానికి ఈ నరికివేత ఘటనలు తూట్లు పొడుస్తున్నాయి. చెట్లు కేవలం నీడనే కాకుండా నేల సారాన్ని పెంచడంలో, వర్షపాతం సమతుల్యతలో, గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అక్రమ నరికివేత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయానికే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణమని, కొందరు అటవీ ఉద్యోగులు అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్రమ కట్టెల రవాణాకు సహకరిస్తున్న వారిపై మరియు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడవులను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

