గ్రామాల్లో సామాజిక మార్పే పోలీసుల లక్ష్యం
యువత మద్యానికి దూరంగా ఉండాలి
తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి బిడ్డ ప్రాథమిక బాధ్యత
సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్
ఆకునూర్ గ్రామంలో ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం ప్రారంభం
సిద్దిపేట సురక్ష నేత్ర కింద సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవం
హెల్మెట్ల పంపిణీ.. క్రీడాకారులకు బహుమతుల ప్రదానం
కాకతీయ, చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని గ్రామాలను మరింత సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు పెంపొందించేందుకు ‘మన ఊరు.. మన పోలీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామంలో పోలీస్ కమిషనర్ గ్రామస్తులతో మమేకమై భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కమిషనర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఈ సందర్భంగా సీపీ సాధన రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వారిని గౌరవించడం మరియు సంరక్షించడం ప్రతి బిడ్డ బాధ్యత అని సూచించారు. యువతను మద్యానికి దూరంగా ఉంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సరైన మార్గంలో నడిపించాలని కోరారు. పోలీస్ శాఖ కేవలం చట్టాన్ని అమలు చేసే సంస్థ మాత్రమే కాదని, ప్రజలతో కలిసి మెరుగైన సమాజాన్ని నిర్మించే భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు. రాబోయే 9 నుండి 10 నెలల్లో సిద్దిపేట జిల్లాలో సురక్షిత గ్రామాలను తయారు చేయడమే తన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ‘మన పోలీస్ – మన ఊరు’ ద్వారా తాము ప్రజల వద్దకు అధికారిక యంత్రాంగంలా కాకుండా, అభివృద్ధిలో భాగస్వాములుగా వస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వాలీబాల్ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, పలువురు ప్రయాణికులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ రమేష్ నాయక్, ఎస్ఐ అపూర్వ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, ఉప సర్పంచ్ కడారి పల్లవి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

